AP High Court: ఏపి రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో రోజు వారి విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ రెండవ రోజు తన వాదనలు వినిపించారు. అమరావతి రాజధానికి సంబంధించి కీలక అంశాలను న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారనీ, రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలను చేశారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్దమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు.
ఈ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారంటే .. అమరావతి రైతుల రాజధాని కాదు, ఏపి ప్రజలందరి రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు అంటే.. వాళ్ల కోసం చేసిన పోరాడటం మాత్రమే కాదనీ, దేశ ప్రజలందరి కోసం పోరాటం చేశారని సీజే అన్నారు.