Amaravathi Mahaa Padayatra: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో 11వ రోజుకు చేరింది. మరో వైపు రాజధాని కోసం రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం జిల్లాలోని విక్కిరాలపేట నుండి ప్రారంభమైన పాదయాత్ర పది కిలో మీటర్లు నడిచి కందుకూరు వరకూ చేరింది. తొలుత సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అమరావతి అమరవీరులకు నివాళులర్పించారు. అమరావతి లక్ష్యసాధన ప్రతిజ్ఞ చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటల వరకూ పాదయాత్ర మార్గంలో కళ్లకు గంతలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం 6గంటల నుండి ఏడు గంటల వరకూ అమరావతి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు.
నేటి రైతుల పాదయాత్ర లో గుంటూరు జిల్లా తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలియజేశారు. రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి అయినా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో అవాస్తవాలు చెబుతూ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వర్షం పడుతున్నా రైతులు పాదయాత్రను కొనసాగించారు. వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు.