Gottipati Ravi Kumar: రాష్ట్రంలో ఫించన్లు నిలిపివేత, తొలగింపులపై ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఒకనెల పింఛన్ మరో నెలలో ఇవ్వమని చెప్పడం దుర్మార్గమని అన్నారు. జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్ల అవుతున్నా రూ.3వేలు చొప్పు పింఛన్ ఇవ్వలేకపోయారని విమర్శించారు. గడచిన మూడు నెలల నుంచి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 28వేల పింఛన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆగస్టు నెలలో మొత్తం 9,600 పింఛన్లను ప్రభుత్వం తొలగించిందని, తన అద్దంకి నియోజకవర్గంలో 1,600 వరకు పింఛన్లు తీసేశారని చెప్పారు. మరల ఈ సెప్టెంబర్ నెలలో ఈ కెవైసి, కరెంటు చార్జీలు, పలు కారణాలు చూపి జిల్లాలో దాదాపుగా 21 వేల పెన్షన్లు నిలిపివేశారని విమర్శించారు.
62 ఏళ్ల వయోపరిమితిని 60 ఏళ్లకు కుదించితే వాస్తవానికి పింఛన్ పొందే వారి సంఖ్య పెరగాలి కానీ జగన్ ప్రభుత్వంలో ఫించన్ల సంఖ్య తగ్గిపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి (2019 మే) రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల 25వేల మందికి ఠంఛన్ గా ఒకటోతేదీన పింఛన్లు అందించడం జరిగిందన్నారు. అవ్వ, తాతలు, దివ్యాంగులు, వితంతువులు వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో లబోదిబోమంటున్నారని రవికుమార్ అన్నారు. ముసలి తనంలో పిల్లలు వేరే చోట ఉండడం వలనో, అనారోగ్య రీత్యా ఒకటి రెండు నెలలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వలన పెన్షన్లను లబ్ధిదారులు తీసుకోలేకపోవచ్చు, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఇక ఆ నెల పెన్షన్ ఇవ్వము అనడం పెన్షనర్లపై కక్షసాధించడమేనని రవికుమార్ అన్నారు.ఇదంతా వైసీపీ ప్రభుత్వం పెన్షన్ లబ్దిదారులను తగ్గించే క్రమంలో భాగంగానే కనబడుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లపై ఆధారపడి జీవించే వారు ఎంతో మంది వున్నారని అన్నారు.
ఒకేరేషన్ కార్డులో ఇద్దరు పింఛన్ దారులు ఉంటే వారిద్దరికీ పింఛన్లు తీసేశారనీ,ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లకు ఎసరు పెట్టారని విమర్శించారు. దివ్యాంగులు, కిడ్నీరోగులకు ఇవ్వాల్సిన పింఛన్లలోనూ కోతపెట్టారని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు అండగా ఉంటామని గతంలో,పాదయాత్రలో ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు నమ్మించి వంచించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా సామాజిక పింఛన్ల పంపిణీలో మానవత్వంతో వ్యవహరించి, తొలగించిన పింఛన్లన్నింటినీ పునరుద్ధరించాలని రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.