AP High Court: ఏపిలో గణపతి నవరాత్రి ఉత్సవాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితికి తెరపడింది. గత రెండు రోజుల నుండి గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం, విమర్శలు, ప్రతి విమర్శలు, నిరసనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపి హైకోర్టు గణేష్ ఉత్సవాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలు పాటిస్తూ వినాయక మండపాల్లో పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. ప్రైవేటు స్థలాల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందనీ, నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పూజలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది, ఒకే సారి అయిదుగురు ఉంచకండా పూజలు చేసుకోవాలని చెప్పింది. అయితే పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది.