Prakasam SP: ప్రకాశం జిల్లా మొగిలిచర్లకు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ స్పందిస్తూ చంద్రబాబుకు ఘాటుగా, సూటిగా సమాధానం ఇస్తూ లేఖ రాశారు. లేఖలో చంద్రబాబు రాసిన విషయాలు తనను దిగ్భాంతికి గురి చేశాయన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారని పేర్కొనడం తమను నిరాశకు గురి చేసిందన్నారు.
రెండు వర్గాలు ఘర్షణపడితే ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు బెదిరించడం వల్ల ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న విషయంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్న ఎస్పీ..ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారన్నది అవాస్తమన్నారు. తాము ఎవరి పక్షాన నిలబడలేదని స్పష్టం చేసిన ఎస్పీ.. పోలీసులు అధికార పక్షానికి కాపు కాస్తున్నారని ఆరోపించడం తమ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందనీ, పోలీసుల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని అన్నారు. వాస్తవాలపై సరైన సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని చంద్రబాబుకు ఎస్పీ మలిక గార్గ్ హితవు పలికారు.
విషయం ఏమిటంటే.. ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు మొగిలిచర్లకు చెందిన టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారనీ, పోలీసుల చిత్ర హింసలకు భయపడి రత్తయ్య, శ్రీకాంత్ అనే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారని పేర్కొంటూ చంద్రబాబు పోలీసుల తీరును తప్పుబడుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.
Read More: Chandra Babu: లింగసముద్రం ఘటనపై తక్షణం విచారణ జరిపించాలి..! డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు..!!