విశ్వసనీయత, పారద్శకత, నీతి నిజాయితీ గురించి పదే పదే ప్రస్తావించే జగన్ మోహన్ రెడ్డి… అవినీతి గురించి, స్కామ్ల గురించి ‘‘0’’ బడ్జెట్ పాలిటిక్స్ లపై మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బాండ్ల ద్వారా అందిన నిధుల విషయాన్ని ప్రజలకి ఎందుకు చెప్పడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఏ పెట్టుబడిదారుడు, ఏ కంపెనీ ఎంత మొత్తం ఇచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యానికి సమాచారం చాలా అవసరం. ఎలక్ట్రోరల్ బాండ్లు చట్టబద్ధ క్విడ్ప్రోకో అని విమర్శించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీం ధర్మాసనం స్పష్టంగా తన తీర్పులో వెల్లడించింది. ఈ బాండ్ల వ్యవహారం అతిపెద్ద స్కామ్. మొత్తం బాండ్లలో సగం 6,565 కోట్లు బిజెపి పార్టీకే అందాయి. అధేవిధంగా రాష్ట్రంలో వైసిపికి 337 కోట్లు, టిడిపికి 218.88 కోట్లు, జనసేనకు 21 కోట్లు కార్పొరేట్ సంస్ధల ద్వారా అందాయని ఎన్నికల కమీషన్ ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రోరల్బాండ్ల వ్యవహారంపై చర్చ జరుగుతుంటే వైసిపి, టిడిపి, జనసేనలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.పార్టీల జెండా రంగులే వేరు… ఎజెండా ఒక్కటేనని దుయ్యబట్టారు. రాజకీయాలను డబ్బులు ఏస్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో ప్రజలకు అర్ధమవుతుందన్నారు.ఎలక్ట్రోరల్ బాండ్లను రద్దు చేయాలని సిపిఎం మొదటి నుండి పోరాడుతుందని, సుప్రీంలో కేసు వేసి చివరి వరకూ పోరాడిరదన్నారు. ఈ బాండ్లు తీసుకోని పార్టీలు వామక్షాలు, సిపిఐ(యం) మాత్రమేనని తెలిపారు.