Steel Plant: అమరావతి : నెల్లూరు జిల్లాకు జగన్మోహనరెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మినపట్నం – మోమిడి పరిధిలో రూ.7500 కోట్ల అంచనా వ్యయంతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ను జిందాల్ ఏర్పాటు చేయనున్నది. గతంలో కిన్నెటా పవర్ కు కేటాయించిన భూములను ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను జిందాల్ సంస్థకు కేటాయించింది.
ఈ మేరకు జిందాల్ కు 860 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల 2500 మందికి ప్రత్యక్షంగా, సుమారు 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ప్లాంట్ విస్తరణ కు వచ్చే నాలుగు సంవత్సరాల్లో మూడు వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుండటం పట్ల ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.