Kondapi News: కొండపి నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన దివంగత నాయకుడు దామచర్ల ఆంజనేయులు ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు సెంటర్ వద్ద గురువారం దామచర్ల 92వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని వివరించారు. దామచర్ల చూపిన బాటలో నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. దామచర్ల మనుమడు, స్థానిక టీడీపీ నాయకుడు దామచర్ల సత్యనారాయణ (సత్య) మాట్లాడుతూ తన తాత చూపిన బాటలోనే తమ కుటుంబం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. తొలుత నేతలు దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం అభిమానులు, కార్యకర్తలకు అల్పాహారం పంపిణీ చేశారు.