YS Sharmila: తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు ఆయన సోదరుడు ఏపి సీఎం వైఎస్ జగన్తో విభేదాలు నెలకొన్నాయనీ, త్వరలో ఏపిలో రాజకీయ పార్టీ పెట్టనున్నారంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు బలం చేకూరేలా షర్మిల నేడు వ్యాఖ్యలు చేయడం ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఏపిలో రాజకీయ పార్టీ ఏర్పాటు అంశంపై సోమవారం వైఎస్ షర్మిలను మీడియా ప్రశ్నించగా.. “రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టొచ్చు.. పెట్టకూడదని రూల్ ఏమి లేదు” కదా అంటూ సమాధానం ఇచ్చారు.
ఇటీవల క్రిస్మస్ వేడుకలకు పులివెందులకు వెళ్లిన వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ తో కలిసి వైఎస్ ఘాట్ వద్ద ప్రార్ధనల్లో పాల్గొనలేదు. షర్మిల, విజయమ్మ, జగన్ లు వేరువేరుగా ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి వెళ్లారు. ఆ రోజు రాత్రికి రాత్రే పులివెందుల నుండి వైఎస్ షర్మిల హైదరాబాద్ పయనమైయ్యారని వార్తలు వచ్చాయి. దీంతో వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల కారణంగా మనస్పర్ధనలు చోటుచేసుకున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారంటూ గతంలో ఏబీఎన్ లో వార్తలు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి వంటి వైసీపీ నేతలు అవన్నీ తప్పుడు వార్తలు అంటూ ఖండించారు.
ఆ తరువాత కొద్ది రోజులకే నిజంగానే షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆనాడు దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇస్తూ తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారి మధ్య అభిప్రాయ భేదాలే ఉన్నాయి తప్ప విభేదాలు లేవని అన్నారు. అయితే ఇప్పుడు షర్మిల ఏపిలో రాజకీయ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఒక వేళ నిజంగా ఏపిలో షర్మిల రాజకీయ పార్టీ పెడితే వైసీపీ శ్రేణుల్లో కొంత అలజడి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.