Viveka case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యాంగ్మూల పత్రాలను సీబీఐ నేడు న్యాయవాదులకు అందజేసింది. ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకడైన వివేకా కారు డైవర్ షేక్ దస్తగిరి ఇంతకు ముందే అప్రూవర్ గా మారి పొద్దుటూరు కోర్టులో కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కన్ఫెషన్ స్టెట్ మెంట్ లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ను సీబీఐ నిన్న కడప కోర్టులో అందజేయగా విచారణ జరిపింది. కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రతులను న్యాయవాదులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ఈ రోజు ఇతర నిందితుల తరపు న్యాయవాదులకు సీబీఐ అందజేసింది.
బెంగళూరు భూ వివాదంలో వాటా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్న ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్యకు ప్లాన్ చేశాడని దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో కలిసి హత్య చేసినట్లు దస్తగిరి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారనీ వివేకా.. గంగిరెడ్డి, అవినాష్ లకు వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు కూడా బంద్ అయ్యాయని పేర్కొన్నాడు. కోటి రూపాయలు ఇస్తాం, వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించాడు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ కాగా తనకు అయిదు కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారని దస్తగిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు. మిగిలిన 75 లక్షలు తన స్నేహితుడు మున్నా దగ్గర దాచినట్లు పేర్కొన్నారు. సునీల్ యాదవ్, ఉమా శంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్లు తెలిపారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డితో కలిసి తాను వివేకా ఇంటి ప్రహరీగోడ దూకి లోపలికి వెళ్లినట్లు దస్తగిరి వెల్లడించారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు దస్తగిరి వ్యాంగ్మూలంలో పేర్కొన్నాడు.