Village Volunteer: ప్రభుత్వ పథకాలను అందించే నెపంతో ఓ ఇంటికి తరచు వెళుతున్న గ్రామ సచివాలయ వాలంటీర్ ఇంట్లో ఎవరో లేని సమయంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు చేసిన తప్పులు వాలంటీర్ వ్యవస్థకు తలవొంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. ఇటీవల ఓ వాలంటీర్ పెన్షన్ డబ్బులు తీసుకుని ప్రియురాలితో ఉడాయించిన ఘటన మరువక మునుపే ఓ వాలంటీర్ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ వాలంటీర్ పై పోలీసులు పొక్సో చట్ట కింద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలిలంక గ్రామానికి చెందిన వాలంటీర్ బూసి సతీష్ (23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని పెద్దలకు చెప్పలేదు. అయితే కొద్ది రోజులుగా ఆ బాలిక దిగాలుగా ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో వాలంటీర్ చేసిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసు స్టేషన్ లో వాలంటీర్ పై ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.