ఏపిలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులైన 13 లక్షల మందికి ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినట్లుగా ప్రభుత్వం చూపితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేత పర్చూరి అశోక్ బాబు సవాల్ విసిరారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు 13 లక్షల 30 వేల మందికి ఏ నెల జీతం ఆ నెల చెల్లించలేదని తెలిపారు. నవంబర్ నెల 9వ తేదీ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో 30 శాతం మందికి ఇంత వరకు జీతాలు రాలేదని చెప్పారు. పోలీసు, హెల్త్, డిపార్టుమెంట్లు తప్ప టీచర్లకు, మున్సిపల్, గ్రాంటిన్ ఎయిడ్ ఉద్యోగులకు ఇంత వరకు పెన్షన్లు రాలేదనీ, ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల నుండి జీతాలు లేవలని చెప్పారు.
ఆప్కాస్ పేరుతో 99 వేల మంది ఉద్యోగులు రిజిష్టర్ చేయించుకున్నారనీ, ఏ ఒక్క నెలలో కూడా ఆప్కాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ నెలకు ఆనెల పూర్తిగా జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. 80 శాతం జీతాలు ఇచ్చి 20 శాతం టెక్నికల్ సమస్యలు వచ్చాయని దాటవేస్తూ వస్తున్నారని అన్నారు. రెగ్యులర్ గా జీతాలు ఇవ్వలేని ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని విమర్శించారు. 2022 వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉందని అశోక్ బాబు అన్నారు. 2021లో కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జీతాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని పేర్కొన్నారు. రాష్ట్రం కేవలం అప్పులపై ఆధారపడి నడుస్తోందని విమర్శించారు. అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయని చెప్పారు.
రాష్ట్రంలోని 4 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్థులు, 4 లక్షల మంది పెన్షనర్లకు, వాలంటీర్లకు మొత్తం 13 లక్షల మందికి చెల్లింపులకు గానూ రూ.5,500 కోట్లు సిద్దంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నారు. రూ.1700 కోట్లు సామాజిక పెన్షన్లకు అవసరం అవుతాయని చెప్పారు. ప్రతి నెల ఈ అమౌంటు సరిచేసుకోవాలి. దాదాపు 7,200 కోట్లు 1వ తేది నాటికి ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యాట్ కలెక్షన్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతోందనీ, అదే విదంగా రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూనే ఉందనీ, రాష్ట్రంలో ఇతరత్రా ఆదాయాలు పెరిగాయనీ అయినా జీతాలను సక్రమంగా చెల్లించడం లేదని విమర్శించారు. తీసుకువచ్చిన అప్లులు అంతా ఏమవుతున్నాయో తెలియడంలేదని అన్నారు. ఇంత వరకు ప్రభుత్వం ఒక్క శ్వేత పత్రం కూడా విడుదల చేయలేదని అన్నారు.
పత్రికలు తప్పు చెబుతున్నాయంటూ ప్రభుత్వం పత్రికలపై పడి ఏడుస్తోందనీ, పత్రికలు అపద్దాలు చెబుతుంటే ప్రభుత్వం నిజాలు చెప్పాలని అశోక్ బాబు కోరారు. రాష్ట్రంలో 80 శాతం మంది ఉద్యోగులు తమ జీతాల కోసం ఎదురుచూస్తుంటారనీ, ఇంటి అద్దెలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు, మందులు, ఇతరత్రా నిత్యవసర ఖర్చులన్నింటికి జీతాలపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. చిన్న చిన్న ఉద్యోగస్థులకు 3 నెలలుగా జీతాలు రావడంలేదని తెలిపారు. ఇంతటి దారుణ పరిస్థితులు రావడానికి ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని ఆయన అన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉండదని అశోక్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం జీతాల విషయంలో అవలంబిస్తున్న విధానం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతోందో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని పర్చూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు.