TDP Mahanadu: మహానాడు తెలుగు దేశం పార్టీకి ఒక పండుగ లాంటిది. ఆ పండుగ ముగిసింది. ఆ పార్టీ అంచనాలకు మించి హజరు కావడంతో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మహానాడుకు స్వచ్చందంగా తరలివచ్చి సక్సెస్ చేశారు. మహానాడు ఇంత సక్సెస్ కావడానికి కారణాలు ఏమిటి..? దీని వెనుక పని చేసిన శక్తులు ఏమిటి..? అసలు మహనాడు ఒంగోలులోనే పెట్టడానికి కారణం ఏమిటి..? ఒంగోలు లాంటి ఏరియాలో మహనాడు పెట్టి సక్సెస్ అవ్వడానికి మూల కారణం ఏమిటి..? అనే విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ప్రాంతాలను వదులుకొని ఒంగోలు ప్రాంతంలో మహానాడు పెట్టారు. విశాఖ పట్టణం ఇప్పటికీ టీడీపీకి కంచుకోట. విశాఖలో మహనాడు పెట్టవచ్చు కానీ పెట్టలేదు. రాజమండ్రి పట్టణం, రూరల్ టీడీపీ గెలుచుకున్నాయి. ఇప్పటికీ రాజమండ్రిలో టీడీపీకి ఓటింగ్ బాగా ఉంది. కానీ రాజమండ్రి లో పెట్టలేదు. విజయవాడ లేదా గుంటూరులో పెట్టవచ్చు కానీ అక్కడా పెట్టలేదు. ఎప్పటి నుండి టీడీపీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను వదులుకుని ఒంగోలులోనే మహానాడు పెట్టారు అంటే మిగిలిన ప్రాంతాల్లోని నాయకులు అన్యమనస్కంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రిలో మహానాడు పెట్టాలి అనుకున్నారు కానీ ఆ ప్రాంతంలోని నాయకులు ముందుకు రాలేదు. ఇక్కడ మహనాడు పెట్టండి, మేము సక్సెస్ చేస్తాము అని చెప్పలేకపోయారు. పార్టీ పెద్దలకు చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. విశాఖలో పెట్టాలని అనుకుంటే అక్కడ పార్టీ బలంగా ఉన్నా నాయకుల మధ్య ఐక్యత లేదు.
ఇక విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పెట్టాలి అనుకుంటే కొన్ని నాయకత్వ లోపాలు ఉన్నాయి. అధికార పార్టీ అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రం. టీడీపీకి అంతగా బలం ఉన్న జిల్లా కూడా కాదు. 2004, 2009 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఒకే స్థానాన్ని గెలుచుకుంది. 2014 లో టీడీపీ గాలిలోనూ జిల్లా వ్యాప్తంగా అయిదు స్థానాలే గెలుచుకుంది. కాకపోతే 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఓటింగ్ శాతం టీడీపీకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి 40 శాతం ఓటింగ్ రాగా ప్రకాశం జిల్లాలో 42..70 శాతం వచ్చింది. 2019 ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఎవరి మీద అక్రమ కేసులు పెడతారా అని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పార్టీ నేతలు నైరాశ్యంలో ఉన్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం గత ఏడాది కాలంగా పార్టీ నేతలు చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. టీమ్ వర్క్ చేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం అన్నట్లుగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు. పర్చూరు, అద్దంకి, కొండెపి, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి తదితర నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. గొట్టిపాటి రవికుమార్ ఈ జిల్లాలో పార్టీకి పెద్ద అసెట్. ఏలూరి సాంబశివరావు మరో అసెట్. అలానే దామచర్ల సత్య. ఈ ముగ్గురుతో పాటు దామచర్ల జనార్థన్, ఉగ్ర నర్శింహరెడ్డి, అశోక్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి ఇలా మంది నాయకులు ఉన్నారు. వీళ్లందరూ టీమ్ వర్క్ చేశారు. ఈగోలను పక్కన పెట్టి అందరూ ఇది తమ పార్టీ కార్యక్రమం అన్నట్లుగా సమిష్టిగా కృషి చేశారు. తమ పార్టీ అధికారంలోకి రావాలి అన్న పట్టుదలతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సరి చేసుకుంటూ కలిసి ముందుకు సాగుతున్నారు.
టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు వెళ్లిపోయినా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వత్తిళ్లకు లొంగకుండా టీడీపీలో గట్టిగా పని చేస్తున్నారు. ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ క్వారీలపై కేసులు నమోదు చేశారు. ఆర్ధిక మూలాలను దెబ్బతీశారు. అరెస్టు చేయాలని చూశారు. ఆయన కోర్టుల ద్వారా ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని నాయకులు మహానాడు నిర్వహించడానికి అంతగా సుముఖత వ్యక్తం చేయని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఈ నాయకులు మాత్రం మహానాడు ఇక్కడ పెట్టండి. మేము భుజస్కందాలపై వేసుకుని సక్సెస్ చేస్తాం అంటూ ముందుకు వచ్చారు. చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పారు. వీళ్లు బాధ్యత తీసుకోవడంతో మహానాడు సక్సెస్ అవుతుందని ముందుగానే సిగ్నల్స్ వచ్చాయి. అయితే మహానాడు నిర్వహణ అంటే చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని. పార్టీ ఇచ్చినప్పటికీ కనబడని ఖర్చులు చాలా ఉంటాయి. అన్నింటికీ సిద్దపడే ఇక్కడి నాయకులు సిద్దపడ్డారు. టీమ్ వర్క్ చేసి నాయకులు సక్సెస్ అయ్యారు. ఒంగోలు అంటే దామచర్ల సత్య ఉన్నారు అన్న దీమా టీడీపీలో ఉంది. మొదటి నుండి దామచర్ల ఫ్యామిలీ పార్టీ కోసం ఎంతైనా సొంతంగా ఖర్చు చేస్తుండేవారు. పార్టీ కోసం ఈ కుటుంబం ఎంతగా పని చేస్తుందో అందరికీ తెలుసు. ఈ విషయంలో సత్య ముందు వరుసలో ఉండగా జనార్ధన్ కుటుంబ సభ్యులు ఇంటింటికి వెళ్లి మహానాడుకు రండి, ఇది మా ఇంట్లో కార్యక్రమం లాంటిది అంటూ బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. వీళ్లతో పాటు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు ఇతర నాయకులు తెరవెనుక కార్యక్రమాలు అన్నీ చూసుకున్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు సమైక్యంగా పని చేయడంతో మహానాడు ఇంత సక్సెస్ అయ్యింది. ఒంగోలులో కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో మహానాడు పెట్టి ఉంటే ఇంత సక్సెస్ అయ్యేది కాదేమో అన్న అభిప్రాయం కూడా ఆ పార్టీ నేతల నుండి వ్యక్తం అవుతోంది
.