టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ చేపట్టిన రోడ్ షో, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గిద్దలూరులో చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభా ప్రాంగణం మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తిరుగుబాటు చేసి టీడీపీ అభ్యర్ధులను గెలిపించారన్నారు. వైసీపీ పోయ్యే పార్టీ, ఆరిపోయే దీపం, ఎక్స్ పైరీ డేట్ దగ్గరకి వచ్చిందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు, బాధలు వచ్చాయని అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని ధరలు పెంచి వీర బాదుడు బాదుతున్నారని, ధరలు పెరగడానికి సైకో జగనే కారణమని అన్నారు. చెత్తమీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. గతంలో ఉచితంగా లభించే ఇసుక ఇప్పుడు బంగారంగ మారిందన్నారు. దేశంలో ఎక్కడా దొరకని జే బ్రాండ్ మద్యం ఏపిలో అమ్ముతున్నారంటూ విమర్శించారు. తోపుడు బండ్లలో కూడా ఫోన్ పే చేస్తున్నారనీ కానీ ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో మాత్రం ఫోన్ పే లేదని అన్నారు. పోలీసులు సహకరించకపోతే జగన్ ఇంట్లో నుండి కూడా బయటకు రావడం లేదని, రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రెండు లక్షల అప్పు చేశాడని, ఈ సైకో అప్పులు కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని విమర్శించారు.
జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.43వేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడని సీబీఐ తేల్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. బాబాయి (వివేకా) ను ఎవరు చంపారో ప్రజలకు అర్ధం అయ్యిందనీ, అబ్బాయిని కాపాడుకోవడానికి డ్రామాలు అడుతూనే ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు. వివేకా హత్య కేసులో విచారణలో ఉన్న సీబీఐ అధికారులపైనా కేసులు పెట్టారని అన్నారు. వివేకా హత్య కేసు పోలీసులకు ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తానే ప్రారంభించాననీ, మళ్లీ తానే నీళ్లు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తొలుత చంద్రబాబుకు గాంధీ బొమ్మ కూడలిలో టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్ షోలో టీడీపీ పాటలు వేయకుండా పోలీసులు తొలుత అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆగ్రహంతో పోలీసులు వెనక్కి తగ్గారు.