Prakasam News: రాష్ట్రంలో జిల్లాల విభజనపై పలు ప్రాంతాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల విభజనలో ప్రభుత్వ ప్రతిపాదనలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాలకు జిల్లా కేంద్రం దూర భారమై ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. జిల్లాల విభజన అంశంపై ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఆఘమేఘాల మీద జిల్లాల ఏర్పాటు వలన ప్రయోజనం ఉండదని రవికుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన అద్దంకి నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గాన్ని సుమారు 120 కిలో మీటర్ల దూరంలో ఉండే బాపట్ల జిల్లాలో ప్రతిపాదించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటి వరకు అద్దంకి నియోజవకర్గం ఒంగోలు డివిజన్ లో ఉండగా దానిని చీరాల డివిజన్ కు ప్రతిపాదించారన్నారు. అద్దంకి నియోజకవర్గానికి జిల్లా కేంద్రంగా ప్రతిపాదించిన బాపట్ల, డివిజన్ కేంద్రంగా చీరాల రెండు దూరంగా ఉంటాయనీ, దీని వల్ల నియోజవకర్గం నష్టపోతుందని రవికుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వం జిల్లాలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించి ఆ తరువాత జిల్లాల ప్రకటన చేయాలి కానీ ఇలా ఆదరాబాదరాగా జిల్లాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని రవికుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే
వాటిని పరిష్కరించకుండా సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త జిల్లాలు, డివిజన్ల ప్రతిపాదనలు తీసుకువచ్చిదని రవికుమార్ విమర్శించారు. అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలు డివిజన్ లో కొనసాగించడంతో పాటు ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని ఎమ్మెల్యే గొట్టిపాటి డిమాండ్ చేశారు.