Viveka Case: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ ఈ కేసులో కీలక సూత్రధారి దేవిరెడ్డి శివశంకరరెడ్డి అని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించిన తరువాత పలువురు వ్యక్తులు తెరపైకి వచ్చి ట్విస్ట్ లు ఇస్తున్నారు. తొలుత భరత్ కుమార్ ఆ తరువాత గంగాదర్ రెడ్డిలు సీబీఐపైనే ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను విచారించాలని వారు కోరుతున్నారు. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయాంచారు. సీబీఐ ఎఎస్పీ రామ్ సింగ్ పై అభియోగాలు చేశారు. వివేకా హత్య కేసులో ఇతరుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని న్యాయవాది ద్వారా పులివెందుల కోర్టుకు కృష్ణారెడ్డి తెలిపారు. సీబీఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేర పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన తరపు న్యాయవాది లోకశ్వరరెడ్డి కోర్టుకు తెలిపారు.
కృష్ణారెడ్డి దాదాపు 30 సంవత్సరాలుగా వివేకానందరెడ్డి వద్ద పీఏ గా పని చేశారు. ఇప్పుడు ఆయనే వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ పైన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివేకా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలు సీబీఐ నిర్వహిస్తున్న పీఏ కృష్ణా రెడ్డి చేసిన పిర్యాదుపై ఎస్పీ చర్యలు చేపట్టలేదు. దాంతో ఆయన పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో పలు మార్లు కృష్ణారెడ్డిని సీబీఐ ఇంతకు ముందు విచారించింది.