MLA Gottipati Ravi Kumar: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, అకాల వర్షాలు, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్లంపల్లి పొగాకు కొనుగోళ్లు కేంద్రాన్ని సోమవారం ఆయన రైతులు, పొగాకు బోర్డు అధికారులతో కలసి సందర్శించి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. నోబిడ్లు లేకుండా మద్దతుధర లభించేలా చూడాలని అధికారులను కోరారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో పొగాకు కేజీ ధర రూ.263లు లభిస్తుంటే మన రాష్ట్రంలో కేజీ ధర కేవలం రూ.180లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. అయిదేళ్ల క్రితమే లోగ్రేడ్ పొగాకు ధర రూ.120 పలికిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కేవలం రూ.60 నుండి రూ.100లు మాత్రమే లభిస్తుందన్నారు. ఇలాగే కొనసాగితే రైతు పొగాకు పంట పండించే పరిస్థితి ఉండదని రవికుమార్ అన్నారు.
గతంలో లోగ్రేడ్ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్త చేసిన రవికుమార్ ఈ ఎడాది ఎందుకు కొనుగోలు చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే రైతులు పొగాకు సాగు తక్కువగా సాగు చేసినప్పటికీ గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమన్నారు. ఈ కారణాల వల్ల భవిష్యత్తులో పొగాకు పంట సాగు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుకు పెట్టుబడి వ్యయం కూడా విపరీతంగా పెరిగిందనీ, రైతుల ఇబ్బందులను గుర్తించి పొగాకు బోర్డు నుంచి బ్యారెన్ కు లక్ష వరకూ ఆర్ధిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులతో సంప్రదించి పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని రవికుమార్ కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా మొక్కజొన్న, ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రకాశం జిల్లాలో మూడు నెలల క్రితం 26 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేయగా 13 వేల మెట్రిక్ టన్నుల కు మాత్రమే రైతులకు డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 23 కోట్ల బకాయిలు తక్షణమే రైతులకు అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే రవికుమార్ విజ్ఞఫ్తి చేశారు.