Ongole MP: వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత అందరికీ తెలిసిందే.. ప్రకాశం జిల్లాకు.. మరీ ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు వెలుగొండ ప్రాజెక్టు ఒక వరం.. అటువంటి ప్రాజెక్టుకి చూస్తూ.., చూస్తూ అన్యాయం జరుగుతుంటే.. ప్రశ్నించాల్సిన గొంతులు మూగబోయాయి.. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని అడగాల్సిన నోళ్లు ఆగిపోయాయి.. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కీలక సమయస్యని గాలికొదిలేసి జాతీయ, రాష్ట్ర సంబంధిత ప్రాజెక్టులపై ప్రశ్నలు వేసుకుంటూ మన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఘనత చాటుకుంటున్నారు… ఈ సమస్య ఏమిటి..? పరిష్కారం ఏమిటి..!? ఎంపీ మాగుంట చేయాల్సిన పనేమిటి..!? అనేది కొంచెం వివరంగా చెప్పుకుందాం…!
Ongole MP: వెలుగొండకి వచ్చిన నష్టమేమిటి..!?
2014 లో రాష్ట్ర విభజన సమయంలో “ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014” అని ఒక చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వాలు మారినా ఆ చట్టం మారడానికి వీలు లేదు. దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణ దశలో ఉన్న ఆరు నీటి ప్రాజెక్టులకు అనుమతులిచ్చారు. “నెట్టంపూడి, కల్వకుర్తి (తెలంగాణ ప్రాజెక్టులు).., హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ (ఏపీ ప్రాజెక్టులు).. ఈ ఆరు ప్రాజెక్టులకు అనుమతులున్నాయని, పూర్తి చేసుకోవచ్చని చట్టంలోని 11 వ షెడ్యూల్ లో పేర్కొన్నారు. కానీ…. గత వారం విడుదల చేసిన కేంద్ర గెజిట్ లో వెలుగొండ ప్రాజెక్టుకి కేంద్ర అనుమతులు లేవని.. ఆరు నెలల్లోగా అనుమతులు తెసుకోవాలని చూపించారు. కొత్తగా నీటి ప్రాజెక్టులకు అనుమతులు అంటే చాలా పెద్ద ప్రక్రియ.. అంతా సవ్యంగా ఉండి, విభజన చట్టం ప్రకారం ఆమోదం పొందిన ప్రాజెక్టుకి కేంద్ర గెజిట్ లో చోటు లేకపోవడంతో వెలుగొండ భవిత ప్రస్నార్ధకమైంది. ఇప్పటి వరకు రూ. 5500 కోట్లు ఖర్చు చేసారు. మరో ఆరునెలల్లో నీటిని అందించే ప్రణాళికలు వేస్తున్నారు. ఈ దశలో అనుమతులు లేవని చెప్పడం అంటే ఈ ప్రాజెక్టు మనుగడకి ప్రమాదమే….
పరిష్కారం ఏమిటి..!? బాధ్యులెవరు..!?
కేంద్రం రూపొందించిన గెజిట్ లో వెంటనే వెలుగొండ ప్రాజెక్టుని కూడా అనుమతులు ఉన్న ప్రాజెక్టుగా చూపించాలి. కొత్తగా బతిమాలి, పదే పదే తిరగాల్సిన పని కూడా లేదు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం మన హక్కుని మనం అడిగితే చాలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున జలవనరుల శాఖ, స్థానిక ఎంపీ మాగుంట చొరవ తీసుకోవాలి. వెంటనే కేంద్రంతో సంప్రదింపులు జరపాలి. దీనిలో మొదటి బాధ్యుడు ఎంపీ మాగుంటనే అవుతారు. ఎంపీగా ఉంటూ… సరైన సమయానికి లేవనెత్తకపోతే ఈ సమస్య క్లిష్టమైపోతుంది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సాంకేతిక సమస్య అయినా.., ఇతర సమస్య ఏమైనా వెంటనే పరిష్కరించే వీలుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీ కూడా నిర్లక్ష్యం వహిస్తే వెలుగొండ అనుమతుల కోసమే మళ్ళీ మళ్ళీ సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. 1996 నాడు ఏనాడో శంఖుస్థాపన జరిగిన ప్రాజెక్టుకి ఇంకా అనుమతులు లేవు అంటే అది కచ్చితంగా స్థానిక ఎంపీ, ప్రభుత్వ వైఫల్యంగానే ఉంటుంది.
- ఈ కీలక సమయాన్ని పక్కన పెట్టిన మాగుంట ఇతర జాతీయ, రాష్ట్ర సమస్యలపై చాలా తీవ్రంగా దృష్టి పెట్టారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వెలుగొండ సహా.., కిడ్నీ సమస్యలు, కరువు నిధులు, నీటి ఎద్దడి, వెనుకబడిన జిల్లా ప్రత్యేక నిధులు, వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ మాగుంట వీటి జోలికి వెళ్లడం లేదు. సింపుల్ గా… ఎథనాల్ తో పెట్రోలు అనీ.., చిన్న తరహా పరిశ్రమల సామర్ధ్యం పెంపు అనీ.., ఏపీలో మత్స్య పరిశ్రమకు నిధుల పెంపు అనీ… జిల్లాకు, స్థానిక అంశాలకు సంబంధం లేని సమస్యలపై ప్రశ్నలు అడుగుతూ ఘనత చాటుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి.. జిల్లాకు కావాల్సినవి అడిగినప్పటికీ అవేమీ అయ్యే పనులు కాదని ఆ మంత్రులకు తెలుసు, ఎంపీకి తెలుసు..!!