Megastar Chiranjeevi: ఏపిలో సినిమా టికెట్ల అంశం తీవ్ర వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ వర్సెస్ ఏపి ప్రభుత్వం అన్నట్లుగా మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు ముందుకు వేశారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో నేడు చిరంజీవి సమావేశం అయ్యారు. తొలుత ప్రత్యేక విమానంలో బేగంపేట నుండి గన్నవరంకు చేరుకున్న చిరంజీవి..అక్కడ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిని జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం జగన్ ను చిరంజీవి దుశ్సాలువాతో సత్కరించి బొకే అందజేశారు. అనంతరం జగన్, చిరంజీవి లంచ్ మీటింగ్ కొనసాగుతోంది.
సీఎం జగన్మోహనరెడ్డి ఆహ్వానం మేరకు వచ్చినట్లు చిరంజీవి పేర్కొన్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ సినీ పరిశ్రమకు చెందిన బిడ్డగా సమస్యలపై సీఎంతో మాట్లాడేందుకు వచ్చానని పేర్కొన్నారు. సీఎంతో సమావేశం తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు.