Lokesh Yuvagalam Padayatra: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఆదివారం అద్దంకి జరిగిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బహిరంగ సభలో జగన్ సర్కార్ పై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు జగన్ సర్కార్ లో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని, ప్రభుత్వం రాగానే వారి ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ ముస్లిం సోదరులకు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా అందించడంతో పాటు మైనార్టీల సంక్షేమానికి నిధులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాన ముస్లింలకు ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహనరెడ్డి సర్కార్ ను విమర్శిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాలను వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని ప్రకాశం పులిగా అభివర్ణిస్తూ రాబోయే ఎన్నికల్లోనూ గొట్టిపాటిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. సభలో నేతలు పత్తిపాటి పుల్లారావు, దామచర్ల జనార్థన్, జీవీ ఆంజనేయులు, శ్రీరాం మల్యాద్రితో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.