KTR: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మంత్రి కేటిఆర్ నేడు చేసిన ఓ పని పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పూర్తి దాయకంగా నిలిచింది. రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ని మంత్రి కేటిఆర్ అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా నిబంధనలు అందరికీ సమానమేనని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానని పేర్కొన్న మంత్రి కేటిఆర్.. చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని అన్నారు. అయితే బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించడం జరిగిందన్నారు. చలానా విధించిన ఎస్ ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ లకు శాలువా కప్పి అభినందించారు మంత్రి కేటిఆర్. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని కేటిఆర్ అన్నారు. ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ ను చెల్లించారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాననీ, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు.