Home వార్తలు Gottipati Ravi Kumar: ఉపాధి హామీ నిధులు చెల్లించకుంటే ఆందోళన తప్పదు ..ఎమ్మెల్యే గొట్టిపాటి..!!

Gottipati Ravi Kumar: ఉపాధి హామీ నిధులు చెల్లించకుంటే ఆందోళన తప్పదు ..ఎమ్మెల్యే గొట్టిపాటి..!!

Gottipati Ravi Kumar: ఒంగోలు (ప్రకాశం) జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) నిధులు ప్రభుత్వం తక్షణం విడుదల చేయకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేయకతప్పదని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే జూన్ నెలకు సంబంధించి ఉపాధి హామీ కూలీల బకాయిలు రూ.163లు,  జూలై నెలకు సంబంధించి రూ.46 కోట్ల బకాయిలను తక్షణం  చెల్లించాలని కోరారు. అద్దంకి నియోజకవర్గంలో జూన్, జూలై నెలలకు సంబంధించి రూ.13,16,32,159 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించే పవిత్ర ఆశయంతో పనికి అహారా పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పది రోజుల్లోపు చెల్లించాల్సిన ఉపాధి కూలీ వేతనాలను నెల 20రోజులు గడిచినా చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించి లక్షలాది మంది కూలీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో వలస పనులు లేక పేదలందరూ ఉపాధి హామీ పనులకు వెళితే ఆ డబ్బులు జమ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద నిధులు లేవని చెప్పడంపై ఏపి హైకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, బీసీ ఇతర ప్రజా ప్రతినిధులు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

సుప్రీం కోర్టు సూచించినా పట్టించుకోకుండా రాజకీయ కక్షతో నిధులు విడుదల చేయడం లేదనీ, కోర్టుకు నిధులు విడుదల చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చిందనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ లు ముందుకు రావడం లేదని అన్నారు.  గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్ లు రోడ్డున పడ్డారని అన్నారు. వారు అప్పులపాలై వడ్డీలు కట్టలేక ఉన్న ఇళ్లు, వాకిళ్లు అమ్ముకుంటున్నారనీ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగేరా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని గొట్టిపాటి కోరారు.

Exit mobile version