ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడు నెలల తర్వాత మళ్లీ క్యాసినో వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేశారు. క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ తో పాటు ఆయన అనుచరుడు మాధవరెడ్డి నివాసాల్లో మూడు నెలల క్రితం సోదాలు జరిపి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ వ్యవహారంలో కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న ఈడీ అధికారులు ఇప్పుడు మళ్లీ విచారణను ప్రారంభించారు. తాజాగా బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేష్ లను విచారణ జరిపారు. వీరిద్దరు చీకోటి ప్రవీణ్ పాటు క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లుగా ఈడీ అధికారుల ప్రాధమికంగా గుర్తించారు. దీంతో వారు జరిపిన ఆర్ధిక లావాదేవీలపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తొంది. ప్రధానంగా మనీలాండరింగ్ పై ఈడీ దర్యాప్తు జరుపుతోంది.
మరో పక్క టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత ఎల్ రమణ కూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో తమ ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ కు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సంబంధాలు ఉండటంతో ఈ వ్యవహారంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.