శ్రీశైలం ప్రోజెక్ట్ లో నీటి నిల్వ 840 అడుగులు దాటిన వెంటనే రోజుకు ఒక టిఎంసి నీటిని వెలిగొండ రెండు సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్ కు తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2004 లో వెలిగొండ ప్రోజెక్ట్ కు శంఖుస్థాపన చేస్తే…ఇవాళ ఆయన బిడ్డే పూర్తి చేసి,జాతికి అంకితం చేయటం కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చర్లోపల్లి లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…సాగు,త్రాగు నీరు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పశ్చిమ ప్రకాశం వాసుల కల నేడు నెరవేరింది అని తెలిపారు.
ప్రకాశం ,నెల్లూరు, వైయస్ఆర్ జిల్లా లోని ఫ్లోరైడ్ ప్రభావిత,మెట్ట ప్రాంతంలో 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప ప్రోజెక్ట్ అని పేర్కొన్నారు.
ప్రోజెక్ట్ లో మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13 న పూర్తి చేసాము.రెండవ సొరంగం పనులు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఐదు మండలాలు,కడప జిల్లాలో రెండు మండలాలు మొత్తంగా 30 మండలాలకు ప్రోజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ లో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్ కు నీరు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దాదాపుగా 3000 క్యూసెక్కుల సామర్థ్యంతో మొదటి టన్నెల్ పని చేస్తుందని ,8500 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండవ టన్నెల్ పని చేస్తుంది అని పేర్కొన్నారు.
మళ్ళీ అధికారంలో కి వచ్చిన తరువాత ఆర్అండ్అర్ ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన యర్రగొండపాలెం ,కనిగిరి,దర్శి, గిద్దలూరు, బద్వేల్ ప్రాంతాలకు వెలిగొండ పూర్తి ఐతే మంచి జరుగుతుంది అని తెలిసి కూడా ముఖ్యంత్రిగా చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయని విమర్సించారు. గత ప్రభుత్వంలో కేవలం 6.5 కిలోమీటర్లు మాత్రమే సొరంగం పనులు జరిగాయని ఎద్దేవా చేశారు. రెండు టన్నెల్ కలిపి 37 కిలో మీటర్లు ఉంటే… రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 20 కిలో మీటర్లు ప్రోజెక్ట్ ఉరుకులు పరుగులు పెట్టింది అని పేర్కొన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాతనే మిగిలి పోయిన 11 కిలో మీటర్లు టన్నెల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని తెలిపారు.వెలిగొండ ప్రాజెక్టు వలన పశ్చిమ ప్రకాశం, ఉదయగిరి,బద్వేల్ ప్రాంతాలకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.