Polavaram Project: ఏపి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి షెకావత్ సీఎం జగన్ తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఇందుకూరు – 1లో ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో షెకావత్ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. పునరావాస కాలనీని పరిశీలించానన్నారు. వసతులు బాగున్నాయని కితాబు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. మోడీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు మధ్యలో మరో సారి సారి పర్యటిస్తానని షెకావత్ తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని.. కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు తీసుకుని దీన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోలవరం పూర్తి అయితే ఏపి మొత్తం సస్యశ్యామలం అవుతుందని జగన్ పేర్కొన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ద పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. నిర్వసితులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్ట్ ఏజన్సీలతోసమీక్ష జరిపారు.