AP High Court: ఏపిలో మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను జనవరి 28కి హైకోర్టు వాయిదా వేసింది. ఆ రోజు నుంచి పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ లపై విచారణ చేపట్టగా రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్..పిటిషన్ లపై విచారణను కొనసాగించాల్సిందేనని కోర్టును కోరారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేని అన్నారు. విచారణ నేపథ్యంలోనే కొన్ని సంస్థలను బయటకు తరలిస్తున్నారని రైతుల తరపు మరో న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టుకు తెలిపారు. సెలక్ట్ కమిటీ ఆమోదం లేకుండానే బిల్లులను ఆమోదించినట్లు పేర్కొన్నారనీ ఇది రాజ్యాంగ విరుద్దమని జంద్యాల రవిశంకర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటీషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. రైతుల తరపు న్యాయవాదులు నోట్ సమర్పించిన తరువాత అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.