AP High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ కి ఏపి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. కడప కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు అధికారిపై కేసు నమోదు చేయడం పట్ల సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం తదనంతర చర్యలన్నింటిపై స్టే ఇచ్చింది. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డిని పలు మార్లు విచారించారు. అయితే ఉదయ్ కుమార్ రెడ్డి ఇటీవల తనను సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయ్ కుమార్ సింగ్ పిటిషన్ విచారణ చేపట్టిన కడప కోర్టు.. సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కడప రిమ్స్ పోలీసులు.