Home వార్తలు ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వరుగా మరియు 1983 బ్యాక్ కి చెందిన రిటైర్డు ఐ.ఆర్.ఎస్. అధికారి నీనా నిగమ్ ను స్పెషల్ ఎక్సపెన్డిచర్ అబ్జర్వరునిగా నియమించినట్లు ఇ.సి.ఐ. నుండి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. ఈ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు నేడు భారత ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవుతున్నారన్నారు. ఈ ముగ్గురు రాష్ట్ర పత్యేక పరిశీలకులు వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటిస్తారని మరియు ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు.

ఎన్నికల నిర్వహణలో ఇ.సి. మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పర్చే అంశం, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే తాయిలాల నియంత్రణపై కూడా వీరు ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, లా ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొని, వారి విలువైన అనుభవాలను, సూచలను, సలహాలను ఇస్తారని ఆయన తెలిపారు.

Exit mobile version