Home Uncategorized మనువాద ధర్మంను దేశం మీద రుద్దేందుకు కుట్ర : వి.శ్రీనివాసరావు

మనువాద ధర్మంను దేశం మీద రుద్దేందుకు కుట్ర : వి.శ్రీనివాసరావు

మనువాద ధర్మం పేరుతో దళితులు, బిసిలను కులాల వారీగా విభజించి మూడు వేల క్రితం నాటి అనాగరిక ఆదిమ సమాజాన్ని దేశం మీద రుద్దేందుకు మోడీ ప్రధాని ప్రయత్నం చేస్తున్నారని దళిత శోషన్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎస్) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడ బందరు రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ పీఠికను శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజాస్వామ్య విలువలు గురించి కాకుండా…. ఆధ్యాత్మిక, ఆయోధ్య రామాలయం గురించి మాట్లాడటమంటేనే దేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నం మొదలైనట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు దీన్ని అడ్డుకోవడానికి ముందుకు వస్తారా లేక సాగనిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

మోడీ ఒక వైపు అణగారిన వర్గాలను తొక్కుతూ ఉంటే …జగన్మోహన్ రెడ్డి బిజెపి కి మద్దతిస్తూ మరొక వైపు దళితులు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పడంలో అర్ధం లేదన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగానైనా అంటరాని తనాన్ని పాటిస్తున్న ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటానని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ అమలుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రశ్నిస్తే గొంతులను అణచివేస్తున్నారని వారు విమర్శించారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ… రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు మరో స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు జి నటరాజ్ , క్రాంతి కుమార్ , ముస్లిం మైనార్టీ నాయకులు బేగ్, ప్రజా సంఘాల నాయకులు సూర్యారావు, శ్రీనివాస్, అరుణ, అశోక్ బాబు, శ్యామ్, రారాజు, ప్రసన్న, రాఘవేంద్ర, సుందరయ్య పాల్గొన్నారు.

Exit mobile version