Prakasam Police: ఇటీవల కాలంలో పోలీసులమని, విలేఖరులమని చెప్పి జాతీయ రహాదారిపై లారీ, ఇతర రవాణా వాహనాలను ఆపి మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలోని టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియాంకా కాటా బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై ఇసుక లోడ్ తో వెళుతున్న టిప్పర్ లోడ్ లారీని పోలీసులమని చెప్పి దుండగులు దోచుకుని వెళ్లారు. లారీ డ్రైవర్ ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా ఒంగోలు ఎస్డీపీఓ కేవివిఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరాయకొండ సీఐ ఎం లక్ష్మణ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి 24 గంటల్లో చోరీకి గురైన టప్పర్ ను ట్రేస్ చేశారు.
దొంగిలించిన టిప్పర్ ను సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ఓ మారుమూల ప్రాంతంలో దాచిపెట్టగా సీసీ పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నారు. నిందితులు మోరబోయిన గోపాల కోటయ్య, మందపల్లి సూర్యతేజ, దాసు నగేష్, యాటగిరి హరికృష్ణ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన టీవిఎస్ స్టార్ సిటీ మైటారు సైకిల్, ఆటోను సీజ్ చేశారు. సకాలంలో స్పందించి కేసు చేధించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు వచ్చేలా పై అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.