PDS Rice Scam: రాష్ట్రంలోని 13 జిల్లాల కంటే మన జిల్లాకు ప్రత్యేకత ఉంది..! సహజ వనరులు ఎక్కువగా ఉన్న జిల్లా మనది.., భిన్నమైన నేలలున్న జిల్లా మనది.., సముద్ర తీరం ఎక్కువగా ఉన్న జిల్లా మనది.. పారిశ్రామిక అవకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లా మనది.. విలువైన బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలు అధికంగా లభించే జిల్లా మనది.. ఇన్ని ప్రత్యేకతలున్న మన జిల్లా ప్రగతిలో ముందుండాలి. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు వంటి జిల్లాలను తోసి ప్రగతి, మానవాభివృద్ధి సూచీలో ముందుండాలి.. కానీ ఇప్పటికీ జిల్లాలో వెనుకబాటు ఎక్కువ, ప్రగతి లేక బిక్కుబిక్కుమంటున్న బతుకులు ఎక్కువ..! దీనికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి కరువు, రెండోది రాజకీయ అవినీతి..! మొదటిది ప్రకృతి మనకు ఇస్తుంది. రెండోది మన నాయకులే మన జిల్లాను ముంచుతున్నారు..! జిల్లాలో రాజకీయ అవినీతి కారణంగా ఇక్కడకు పనిచేయడానికి వచ్చే సమర్థులైన అధికారి కూడా రెండు నెలలు కూడా తిరక్కుండానే అవినీతిలో కూరుకుపోయి వాటాల కోసం పాకులాడే దీనస్థితి మనది..! పార్టీలకు అతీతంగా రాజకీయ అవినీతిలో మన జిల్లా ముందుంటుంది. అందుకు సరైన ఒక ఉదాహరణ రేషన్ బియ్యంలో కూడా ఎమ్మెల్యేలకు కమీషన్లు వెళ్లడం..! ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. నెలకు సుమారుగా రూ. 2 కోట్లు వరకు చేతులు మారుతున్న అతి పెద్ద కుంభకోణం ఇది..!!
PDS Rice Scam: ఇప్పుడేమీ కొత్త కాదు.. కాకపోతే పెరిగింది..!!
జిల్లాలో రేషన్ బియ్యం అవినీతి తతంగం ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విచ్చలవిడిగానే జరిగింది. కొన్ని మిల్లులు, కొందరు మిల్లర్లు నాయకులుగా మారుతూ అధికార పార్టీల ఎమ్మెల్యేలకు కమీషన్లు ఇచ్చుకుంటూ నెట్టుకొస్తున్నారు. ఇది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువయింది. జిల్లాలో కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లోని మిల్లులు ఈ రేషన్ బియ్యం అక్రమార్జనలో పేరొందాయి..!
- దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, దర్శి, ముండ్లమూరు మండలంలోని మూడు మిల్లుల్లో రేషన్ బియ్యం పాలిషింగ్ చేసి, అక్రమార్జనకు తెరతీస్తుంటారు. * కారంచేడులో ఇటీవల ఒక పాత మిల్లుని మళ్ళీ ప్రారంభించారు. మార్టూరు మండలంలోని రెండు గ్రామాల్లోని మిల్లుల్లో రేషన్ అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. * చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో ఇటీవల కొత్తగా కొన్ని పాత మిల్లులను మళ్ళీ ఈ దందా కోసం ప్రారంభించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 18 రైస్ మిల్లులు కేవలం రేషన్ బియ్యం పాలిషింగ్ చేసి.. అక్రమార్జన కోసమే పని చేస్తున్నాయి.
- దీనిలో కిలోకి ఇంత అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు వాటాలున్నాయనే ఆరోపణలున్నాయి. నెలవారీ ఎన్ని కిలోలు ఆడితే అంత మేరకు లెక్క ప్రకారం నేతలకు చేరుతుంది. ఈ దందా ఎక్కువయింది, పోలీసులు, రెవెన్యూపై ఎప్పుడైనా ఆరోపణలు వచ్చే సమయంలో ఒకటి, రెండు మిల్లులపై దాడులు చేస్తారు. రికార్డుల్లో చూపడానికి, లెక్కల్లో రాసుకోడానికి, పని చేస్తున్నామని నిరూపించుకోడానికి ఇలా దాడులు జరుగుతుంటాయి. కానీ జరగాల్సిన తతంగం యథేచ్ఛగా జరిగిపోతుంది.
- ఇటీవల ఓ రైస్ మిల్లర్, ఓ నాయకుడికి మధ్య ఫోన్ సంభాషణ వైరల్ ఆయింది. దీనిలో స్థానిక ఎమ్మెల్యేకు కూడా ముడుపులు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. “ఓ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మాట్లాడుకుంటూ… బియ్యం తోలుకో… మీకు ఎమ్మెల్యే అండ ఉంది.. డబ్బులు మేము చూసుకుంటాం.. మొత్తం వ్యవహారం ఎమ్మెల్యే చేతిలోకి వెళ్ళిపోయింది. ఆయన చెప్పినట్టు మనం వినాల్సిందే. పోలీసులకు ఆయన చెప్పుకుంటారు. చేస్తే నువ్వు చేసుకో.. లేదా మా వాళ్ళు రంగంలోకి దిగుతారు. కానీ ఏదైనా మాకు వాటా రావాలి” అంటూ ఎమ్మెల్యే చెప్పినట్టు ఈ ఆడియో సంభాషణలో చర్చించుకున్నారు.
(ఈ రేషన్ దందాపై మరిన్ని ఆధారాలతో లోతైన కథనం..వచ్చే భాగంలో…!)