Home వార్తలు Karamchedu Scam: రూ. 90 లక్షలు స్వాహా..!? కారంచేడు అధికారులపై సర్పంచి ఆరోపణలు..!!

Karamchedu Scam: రూ. 90 లక్షలు స్వాహా..!? కారంచేడు అధికారులపై సర్పంచి ఆరోపణలు..!!

Karamchedu Scam: గ్రామ పంచాయతీలకు ఇటీవల కాలం వరకూ పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగించారు. అడిగేవారు లేకపోవడంతో కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కుమ్మక్కు అయి నిధులు దుర్వినియోగాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున నిధులు గోల్ మాల్ జరిగినట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ శివ పార్వతి ఆరోపించారు.

సర్పంచ్ శివపార్వతి శనివారం కార్యాలయం పంచాయతీ పనులకు సంబంధించి మేజర్మెంట్ బుక్స్(ఎంబీలు), వేతనాలు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని ఆందోళన చేశారు. ప్రత్యేక అధికారి పాలనలో లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగిందని సంబంధిత ఆధారాలతో సహా మండల అధికారులకు, జిల్లా పంచాయతీ అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు సంవత్సరాల కాలంలో కారంచేడు పంచాయితీలో సుమారు రూ. 90  లక్షల నిధుల గోల్ మాల్ జరిగిందని సర్పంచ్ ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మయ్య, ప్రత్యేక అధికారి కే శివ నాగ ప్రసాద్ లు గ్రామ పంచాయతీలో ఏలాంటి అభివృద్ధి చేయకుండా తప్పుడు బిల్లులతో నిధులను దారి మళ్లించారని ఆమె పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ సాధారణ నిధులను అభివృద్ధి పనుల పేరుతో మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ ఖాతాలో జమ చేశారన్నారు. అదే విధంగా శానిటరీ మేస్త్రి ఖాతాలో రూ.31 లక్షలకు పైగా నిధులు జమ చేశారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, చెరువు కాపలాదారుడు, స్లీపర్ ఖాతాలలో లక్షలాది రూపాయలు జమ కావడంపై అవకతవకలు జరిగినట్లు అనుమానం వచ్చిందని ఆమె తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి రికార్డులు, మినిట్స్ బుక్స్, ఎజెండా అంశాలకు, బిల్స్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరినా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. లక్షల రూపాయల నిధులను చెల్లించినట్లు చూపి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ లో పనిచేస్తున్న శానిటరీ కార్మికులు ఓ వైపు ప్రభుత్వం వేతనాలు తీసుకుంటూ మరో వైపు ఉపాధి హామీ పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసి అక్కడ సైతం ఉపాధి నిధులు కాజేస్తున్నట్లు సర్పంచ్ ఆరోపించారు. ట్రెజరీలో సైతం వీరు మేనేజ్‌మెంట్ చేశారని అన్నారు. ఇంటి పన్నులను కూడా వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదని ఆరోపించారు. నిధులు దుర్వినియోగానికి సంబంధించి కొన్ని ఆధారాలను ఆమె మీడియాకు చూపించారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Exit mobile version