Home వార్తలు Chandrababu: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ స్టాండ్ ఇదీ

Chandrababu: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ స్టాండ్ ఇదీ


Chandrababu: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా..గత సంప్రదాయాల మాదిరిగా పోటీ చేయదా అనే విషయంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తొంది. ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయినా టీడీపీ నుండి ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. వైసీపీ అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. నిన్ననే పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్నారు. ఈ తరుణంలో నేడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. టీడీపీ గత సంప్రదాయాలను అనుసరించి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఉప ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తొందని చంద్రబాబు చెప్పారు. ఈ సంప్రదాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సంప్రదాయాన్ని గౌరవించి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయరాదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. చనిపోయిన నేత కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో టీడీపీ ఏనాడూ పోటీ చేయలేదని చంద్రబాబు అన్నారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించింది. దీంతో ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు కనబడటం లేదు. నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 6వ తేదీ వరకూ ఉంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, 26న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.