Home వార్తలు హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ బిజెపిని రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకిస్తే….అదే పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకుంటారా? పార్లమెంట్ లో అన్ని విషయాల్లో మద్దతు ప్రకటిస్తారా అని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. సోమవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ న్యాయ్ యాత్ర లో ఆమె మాట్లాడుతూ…పదేళ్ల వైసిపి, టిడిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు.రాష్ట్రానికి ఒక్క వాగ్ధానం కూడా నెరవర్చని బిజెపి తో పాలక,ప్రతిపక్షాల కలిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి కీలకమైన స్పెషల్ స్టేటస్ ను మోదీ దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి …ఐదేళ్ల అయినా హోదా తెచ్చారా ? నిస్సిగ్గుగా ఎన్నికల తరువాత మళ్ళీ బిజెపికి మద్దతు ఇస్తామని అంటారా అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో బాపట్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జేడి శిలం , సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థి విజేష్ రాజ్ లను గెలిపించాలని కోరారు.

ఐదేళ్లలో ఎన్ని జాబ్ క్యాలెండర్ లు ఇచ్చారు?

అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. ఐదేళ్లలో ఎన్ని జాబ్ క్యాలెండర్ లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 7000 పోస్టులలో డీఎస్సీ ప్రకటిస్తే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి నిలదీశారు.తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి… తీరా ఎన్నికల వేళ కేవలం 6000 పోస్టులతో దగా డీఎస్సీ వేశారని మండిపడ్డారు.

మద్యం అమ్మకాల లెక్కలేవి ?

మధ్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి నేడు స్వయంగా ప్రభుత్వం చేతే మద్యం షాపులను నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాసిరకం మద్యం తాగడం వలన పొరుగు రాష్ట్రాల కంటే 25 శాతం ఎక్కువ మరణాలు ఆంధ్రప్రదేశ్ లోనే సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలుకు డిజిటల్ చెల్లింపులు ఉండవు. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు నష్టపోతే 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. నష్టపరిహారం కింద రైతులకు ఒక్క రూపాయి అయిన ఇచ్చారా అని ప్రశ్నించారు. వైసిపి పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు. ఉపాధి అవకాశాలు లేక రాష్ట్ర యువత మొత్తం వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు.అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులు నియామకం పైనే మొదటి సంతకం పెడతామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఐదు లక్షలతో ఇల్లు నిర్మిస్తామన్నారు.

Exit mobile version