Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై అనుమానితులు ఆరోపణలు చేయడం, ప్రైవేటు కేసు నమోదు కావడం లాంచి చర్యలు నేపథ్యంలో సీబీఐ అధికారుల దర్యాప్తు ముందడుగులు పడలేదు. కొద్ది రోజులు విరామం ఇచ్చిన సీబీఐ అధికారులు మరల కడపకు చేరుకుని వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను వారం రోజుల క్రితం విచారించారు. ఆ తరువాత ఇనాయతుల్లాను అయిదు రోజులుగా తమ వెంటే సీబీఐ అధికారులు ఉంచుకున్నారు. రెండు సీబీఐ బృందాలు కడప నుండి పులివెందులకు చేరుకుని పలు ప్రదేశాలను పరిశీలించారు. సీబీఐ అధికారి అంకిత్ యుదవ్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వివేకా నివాసంతో పాటు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీంచాయి.
ఇనాయతుల్లాతో పాటు పాటు రెవెన్యూ సర్వేయర్ ను కూడా సీబీఐ అధికారులు వెంట బెట్టుకుని పులివెందులలోని పలు ప్రదేశాలను పరిశీలించి అక్కడ స్థలాల్లో కొలతలు తీస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఇనాయుతుల్లానే ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇనాయతుల్లా ఎవరెవరికి పంపాడు అనే విషయాల ఆధారంగా కూడా సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తొంది.
వివేకా హత్య కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.