Home వార్తలు TTD Chairman: భక్తి మాయం వివాదాల మయం..! వైవీకి మళ్ళీ పరీక్ష..!?

TTD Chairman: భక్తి మాయం వివాదాల మయం..! వైవీకి మళ్ళీ పరీక్ష..!?

TTD Chairman: వైవీ సుబ్బారెడ్డి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. సీఎం వైఎస్ జగన్ కు సొంత బాబాయి..టీటీడీ చైర్మన్..మూడు జిల్లాలకు అధికార పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు చూస్తున్నారు. ఇంతకు మించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వైవీ స్వతహాగా తొలి నుండి వివాద రహితుడు. క్రియాశీల రాజకీయాలపైనే అమిత ఆసక్తి ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం జగన్ మాట కాదనలేక టీటీడీ చైర్మన్ గిరీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి సారిగా రెండు ఏదో రెండేళ్లు పూర్తి చేసుకుని రాజ్యసభకు వెళ్లాలని ఆలోచన చేసినా మరో సారి టీటీడీలోనే కొనసాగాల్సి వచ్చింది.

మొదటి సారి టీటీడీ చైర్మన్ గా వైవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక వివాదాలు వచ్చినా ఆయనకు ఉన్న అనుభవం, నైపుణ్యంతో వాటిని పరిష్కరించడంలో సఫలీకృతులైయ్యారు. మొదటి టర్మ్ లో టీటీడీ ఆస్తుల అమ్మకం, తిరుమల బస్సు టికెట్లపై యేసు బొమ్మ, శ్రీవారి పుస్తకంలో ఏసు కీర్తనలు. ఎస్వీబీసీ ఆఫీసులో అశ్లీల చిత్రాల వీక్షణ ఇలా అనేక సమస్యలు చమటలు పట్టించినప్పటికీ వైవీ తొందరపాటు చర్యలకు పోకుండా  చాలా జాగ్రత్తగా వ్యవహరించి వివాదాలను పరిష్కరించుకన్నారు. అయితే తాజాగా రెండవ సారి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా వివాదాలు వీడటం లేదు. రెండవ సారి బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజుల వ్యవధిలోనే రెండు పెద్ద వివాదాలు చుట్టుముట్టాయి.

TTD Chairman: జీడిపప్పు వివాదం..

టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ కేంద్రంగా పురుగులు పట్టిన జీడిపప్పు సరఫరా అయినట్లు మూడు రోజులుగా పెద్ద దుమారం రేగుతోంది. టీటీడీలో సిబ్బంది చేతివాటంతోనే ఈ నాశిరకం జీడిపప్పు సరఫరా జరిగిందంటూ ఇదో పెద్ద అవినీతి వ్యవహారంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయంలోకి వెలితే.. టీటీడీకి హిందూస్థాన్ ముక్తా అనే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ జీడిపప్పును సరఫరా చేస్తుంది. గత నెల టీటీడీ అధికారులు పది లోడ్ల జీడిపప్పును రిజెక్ట్ చేసి వెనక్కు పంపించినట్లే పంపేసి అనధికారికంగా మళ్లీ టీటీడీ గోడౌన్ లోనే పెట్టారని వార్తలు వస్తున్నాయి. అదే పురుగులు పట్టిన జీడీపప్పుని లారీల్లో తిరిగి ప్యాకింగ్ మార్చి లారీ నెంబర్ మార్చి మళ్లీ టీటీడీకి సరఫరా చేశారుట.  ఈ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్ర, విజిలెన్స్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. టీటీడీకి సరఫరా చేస్తున్న కోట్లాది రూపాయల ముడి సరుకుల నాణ్యతను శానిటరీ ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారులు కూడా శ్రద్ధ తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆలయాలలో ప్రసాదాల తయారీకి కొనుగోలు చేస్తున్న ముడిసరుకుల నాణ్యత ప్రమాణాలపై సరైన పరిశీలన ఉండటం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇది చాలా అత్యంత సున్నితమైన అంశం. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. దీంతో మూడు రోజులుగా ఈ వివాదం ముదురుతోంది.

ప్రత్యేక ఆహ్వానితుల నియామకం – కోర్టు అక్షింతలు

మరో పక్క ఇటీవల ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు ప్రత్యేక అహ్వానితుల వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. జంబో బోర్డు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులు ఏమిటి అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ పరిణామంతో అటు సీఎం వైఎస్ జగన్, ఇటు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. వాస్తవానికి టీటీడీలో ఎప్పుడు 20 నుండి 25 మంది సభ్యులు మాత్రమే పాలకమండలి సభ్యులుగా ఉండేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి టర్మ్ లో కొంత మంది సభ్యులను పెంచినా పెద్దగా వివాదం కాలేదు. కానీ ఈ సారి జంబో బోర్డు ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయ్యింది.  

టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మంది ఉండగా అందులో తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర మంత్రుల సిఫార్సులు కాదనలేక సీఎం జగన్ జంబో బోర్డుకు ఓకే చెప్పాల్సి వచ్చిందేమో. కానీ ఇది భక్తుల విశ్వాసాలతో కూడిన విషయం.  ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో కోర్టు తప్పుబట్టింది. వాస్తవానికి ప్రత్యేక ఆహ్వానితులకు టీటీడీ బోర్డులో ఎలాంటి హక్కులు ఉండవు. సమావేశాలకు పాల్గొనే అవకాశం ఉండదు. పాలకమండలిలో ఏ విషయంలో వారు తలదూర్చే అవకాశం లేదు. కాకపోతే వారు బోర్డు సభ్యులకు మాదిరిగానే మర్యాదలు పొందవచ్చు. ప్రోటోకాల్ దర్శనం ఇతర గౌరవాలను మాత్రం పొందుతారు. జంబో బోర్డు నియామకానికి సంబంధించి పూర్తి నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నా వివాదంలో చైర్మన్ కి కూడా కొంత బాధ్యత ఉంటుంది. రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన ఈ రెండు వివాదాస్పద అంశాలు పరిష్కరించుకోవడం వైవీకి కొంత ఇబ్బందికరమే.

Exit mobile version