Home వార్తలు డిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు మాదిరి ఏపీలోనూ ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి – ఏలూరి

డిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు మాదిరి ఏపీలోనూ ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి – ఏలూరి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ఏ విధంగా విచారణ జరుపుతుంతో అదే విధంగా ఏపిలో గత 40 నెలలుగా జరుగుతున్న అక్రమ మద్యం మాఫియాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తంతోనే ఏపితో పాటు దేశ వ్యాప్తంగా మద్యం మాఫియా సాగుతోందని ఆరోపించారు. మద్యం మాఫియా అక్రమ సంపాదన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న కంపెనీలకు చెందిన వ్యక్తులు ఏపిలో అక్రమ మాఫియాలో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ని అరెస్టు చేశారనీ, ఆ కంపెనీలో సి ఎఫ్ ఓ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఆడాన్ డిస్క్లరీ పేరుతో ఏపిలో మద్యం వ్యాపారం చేస్తున్నారని ఏలూరి అన్నారు. ఏపిలో మద్యం మాఫియాపై విచారణ జరిపి ఆ వ్యక్తులను అరెస్టు చేయాలని ఏలూరి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మద్యం అక్రమ వ్యాపారాలు సాగించిన వారందరినీ ప్రభుత్వం జైలు పాలు చేస్తుందని చెప్పారు. మద్య పాన నిషేదం అంటూ గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి ఈ అరెస్ట్ ల వ్యవహారంపై ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని ఏలూరి కోరారు. ఎన్నికల ప్రచారంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేదం అని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారన్నారని ఏలూరి విమర్శించారు. కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నారని ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version