Home వార్తలు కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల నుండి తిరిగి వస్తున్న ఏపి అయ్యప్ప స్వామి భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. పతనంతిట్ట జిల్లా లాహల్యాంప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పత్తనంతిట్ట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది యాత్రికులు ఉన్నారు.

ఏపిలోని ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన 40 మంది దీక్షా స్వాములు ఈ నెల 15వతేదీన శబరిమల వెళ్లారు. వీరు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని సమాాచారం. ప్రమాద సమాచారం తెలియడంతో దీక్షా స్వాముల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version