Pawan Kalyan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న నరసాపురం బహిరంగ సభలో జనసేనను ఉద్దేశించి రౌడీ సేన అంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గా స్పందిస్తూ ఓ కార్టూన్ రూపంలో కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను వైసీపీ నేతలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆ కార్టూన్ లో వివరించడంతో పాటు ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుండి జనసేన వినతి పత్రాలు తీసుకోవడం ప్రదర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుంటే .. తమ పార్టీని రౌడీ సేన అని ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారు అన్నట్లుగా కార్టూన్ ను పోస్టు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రత్యర్ధి పార్టీని రౌడీసేన అని దూషించడం జగన్ కే చెల్లింది అన్నట్లుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ ను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.