MLA Gottipati: ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సంఘటితం గా నిలదీయాలని టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన సంతమాగులూరు మండలం అడవిపాలెం పర్యటనలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు అధికంగా వస్తున్న కరెంటు బిల్లుల గురించి, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్లలో ఆరు సార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు బిగించారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని అన్నారు.
విద్యుత్ వినియోగదారులు కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ట్రూ ఆఫ్ చార్జీలను తాత్కాలికంగా నిలిపివేశారని చెప్పారు. ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెంచడంతో రైతుల కష్టాలు అధికం అయ్యాయన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులు 90 శాతం మేర అంగీకరించారని వైసీపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ సమస్యలకు నిరసనగా ఈనెల 11న అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా మండల విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే రవికుమార్ పిలుపునిచ్చారు.