CM YS Jagan: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ బీ ఫారం అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న క్రమంలో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో విక్రమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా విక్రమ్ రెడ్డి భిఫారం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా నిలపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం ఈ నెల 6వ తేదీ వరకూ జరుగుతుంది. ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. 26వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.