Prakasam News: జిల్లాలో టీడీపీ యాక్టీవ్ అవుతుంది.. ఎమ్మెల్యేలు ముందుండి నడిపిస్తున్నారు.. అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో కీలక నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.. శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది.. అంతా బాగుంది అనుకుంటున్నా దశలో రెండు నియోజకవర్గాల్లో మాత్రం పార్టీకి దిక్కు తోచడం లేదు.. ఉన్న ఇంచార్జిలు సమర్థులు కాదు.., ఆశించినట్టు పనిచేయడం లేదు. పైగా కొత్త ఇంచార్జిలు దొరకడం లేదు.. అందుకే ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీకి ప్రస్తుతానికి తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.. ఒకటి తూర్పున, మరొకటి పశ్చిమాన ఉన్నాయి. సామజిక సమీకరణాలు, శ్రేణుల పనితీరులో రెండు దేనికవే భిన్నం..!
Prakasam News: దర్శిలో రమేష్ “షో”లు ఆగినట్టేనా..!?
దర్శి నియోజకవర్గం టీడీపీకి భిన్నమైనది. బలమైన బీసీ ఓటింగ్.. డామినేట్ చేసేలా రెడ్డి ఓటింగ్.. ప్రభావితం చేసేలా కాపు ఓటింగ్.. చెప్పుకోదగిన కమ్మ ఓటింగ్ ఉన్న దర్శి నియోజకవర్గంలో టీడీపీకి అక్కడక్కడా బలం, బలగం గట్టిగానే ఉంది. లెక్కలన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే దర్శిలో టీడీపీ బరువు మోసే నాయకులూ దొరకడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కదిరి బాబురావు పార్టీని వీడిన తర్వాత చాన్నాళ్లు ఇంచార్జి పోస్టు ఖాళీగా ఉంది. అనేక సంప్రదింపులు, చర్చలు అనంతరం ఎవ్వరికీ ఇష్టం లేకపోవడంతో పమిడి రమేష్ కి ఈ బాధ్యతలు అప్పగించారు. పాపం రమేష్… ఇక్కడి లోతులు, లోటుపాట్లు తెలియక ఒంగోలు నుండి దర్శి వస్తూ, పోతూ.. కొన్నాళ్ళు బాగానే షోలు నడిపించారు. ఆయన రాకతో నియోజకవర్గంలోని టీడీపీ కమ్మ శ్రేణులు యాక్టీవ్ అయ్యాయి. ఆయనను వాడుకునే ప్రయత్నం చేశాయి. దర్శి ఇంఛార్జిగా సుమారు ఏడాది పాటూ పని చేసిన రమేష్ ఏ మాత్రం ఇక్కడి జనాలకు చేరువ కాలేకపోయారు. కనీసం అయిదు మండలాల నాయకులకు, కార్యకర్తలకు కూడా దగ్గరవ్వలేకపోయారు. ఒంగోలు నుండి తన సన్నిహితులతో కలిసి ఇక్కడకు రావడం.., ఓ పూట షోలు చేయడం.. మళ్ళీ వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. ఫోకస్ కి ఇచ్చిన శ్రద్ధ పనిలో ఇవ్వలేదు. నియోజకవర్గ పరిస్థితులు, రాజకీయాన్ని అధ్యయనం చేయలేదు. మరోవైపు ఆయనను ఇన్చార్జిగానే పెట్టారా..!? టికెట్ ఇస్తారా..? అనే అయోమయంలో కూడా పడ్డారు. కాపు, రెడ్డి డామినేటింగ్ ఉన్న నియోజకవర్గంలో తాను నిలవాలి, గెలవాలి అంటే శిద్దా రాఘవరావు తరహాలో విపరీతంగా వెదజల్లాలి.. అనే నిజాన్ని ఆలస్యంగా తెలుసుకుని సైలెంట్ అయ్యారు.. ఆలస్యంగానే మరో నిజాన్ని కూడా గ్రహించి ఇప్పుడు మరీ సైలెంట్ అయ్యారు. దర్శిలో ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న ప్రత్యర్థుల్లో ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలోకి వచ్చి పోటీ చేయనున్నారని ఆలస్యంగా తెలుసుకున్నారు.. (ఈ లైన్ గుర్తుపెట్టుకోండి/ రాసి పెట్టుకోండి.. సందర్భం చూసుకుని తర్వాత మాట్లాడదాం. దర్శిలో ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ప్రత్యర్ధులు వచ్చే ఎన్నికల్లో భిన్న పార్టీల నుండి తలపడనున్నారు) కొన్ని చేదు నిజాలు ఆలస్యంగా గ్రహించిన రమేష్ ఇప్పుడిప్పుడే దర్శికి దూరమయ్యారని టాక్. అందుకే టీడీపీ నాయకులతో కలవడం లేదు. ఇంచార్జిలు అందరితో ఢిల్లీ వెళ్ళలేదు. నిన్న జరిగిన చంద్రబాబు మీటింగ్ కి హాజరు కాలేదు.. అందుకే దర్శిలో టీడీపీకి తాత్కాలికంగా తాళాలు పడినట్టే..!!
చీరాల నడిపించే నేత రావాలా..!!
చీరాలలోనూ భిన్న రాజకీయ పరిస్థితులున్నాయి.. పార్టీ కంటే స్థానిక పరిస్థితులు, నాయకుడు, ఎన్నికల సమయంలో సెంటిమెంట్లు ఎక్కువగా ప్రభావం చూపే నియోజకవర్గం చీరాల. ఇక్కడ కూడా బీసీ ఓటింగ్ ఎక్కువైనప్పటికీ.. బీసీల్లోనే యాదవ, చేనేత, మత్స్యకార కులాలున్నాయి. ఆ తర్వాత ఎక్కువ ఓటింగ్ ఆర్యవైశ్య వర్గానిది.. చీరాలలో పార్టీ పరంగా చూసుకుంటే టీడీపీకి బలం బాగానే ఉంది. వైసీపీ కంటే టీడీపీ కోసం చురుగ్గా పని చేసే క్షేత్రస్థాయి కార్యకర్తల బలం ఎక్కువ.. కానీ చీరాలలో ఈ పార్టీకి సరైన నాయకత్వం లేదు. యడం బాలాజీ ఇంఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన ఈ పార్టీలో బలవంతపు కాపురం చేస్తున్నారు. సందు దొరికితే వైసీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే నాయకుడిగా ఆయన బలహీనతలు చాలానే ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి ఆయన సరిపోడు అనే అభిప్రాయాలున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమంచి, పోతుల సునీత రూపంలో గ్రూపులున్నాయి. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ అందరూ కలిసి గెలిపించుకున్న ఎమ్మెల్యే బలరాం పార్టీ మారిపోయారు. ఆయనతో పాటూ చాల మంది వైసీపీలోకి వెళ్లినప్పటికీ అయిష్టంగానే, పార్టీపై అభిమానాన్నీ చంపుకుని చాలా మంది వెళ్లారు. ప్రస్తుతానికి చీరాలలో టీడీపీని నడిపించే దిక్కు లేదు. మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీలోకి మళ్ళీ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గడిచిన ఆరు నెలల్లో ఆయన రెండు సార్లు పార్టీకి రాయబారం పంపించినట్టు సమాచారం. ఇవన్నీ పుకార్లు మాత్రమే. ఆయన రాకని, నాయకత్వాన్ని టీడీపీలో చాలా మంది ఇష్టపడడం లేదు. అందుకే నియోజకవర్గ పరిస్థితులను అర్ధం చేసుకుని.. మొత్తం డీల్ చేయగలిగే నాయకుడి కోసం టీడీపీ అన్వేషణలో ఉంది. ఇక్కడ కూడా ఒక ట్విస్టు ఉంది. ఈ నియోజకవర్గంలోనూ ఇద్దరు బలమైన నేతల బలమైన మధ్య వైరం ఉంది. సో.., ఇక్కడ కూడా ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల నాటికీ రెండు వేర్వేరు పార్టీల నుండి తలపడనున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలు ఏవైనా ఇక్కడ రాజకీయ ప్రత్యర్ధులు మాత్రం ఆ ఇద్దరు ఉంటారనేది పక్కాగా చెప్పుకోవచ్చు. అంచేత.. టీడీపీలో అప్పుడే నాయకుడి అన్వేషణకు తొందర పడడం లేదు. ప్రస్తుతానికి తాళాలు వేసుకున్నారు.