Home విశ్లేషణ Ongole constituency: బలం, బలగంతో వైసీపీ..! ఆశ, అవకాశంతో టీడీపీ..!!

Ongole constituency: బలం, బలగంతో వైసీపీ..! ఆశ, అవకాశంతో టీడీపీ..!!

Ongole constituency: రాష్ట్రంలో అత్యంత రాజకీయ, సామాజిక చైతన్యం కలిగిన ప్రాంతాల్లో ఒంగోలు ప్రధానమైనది.. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, వైసీపీ, టీడీపీ బలాలు, బలహీనత;లు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి.. 2019 ఎన్నికల్లో ఊహించని ఓటమితో కాస్త కుంగిన దామచర్ల ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతుండగా.., మంత్రిగా జిల్లాను చేతిలో పెట్టుకున్న బాలినేని పట్టు పెంచుకుంటున్నారు..! ఇక్కడి తాజా పరిణామాలు, పరిస్థితులను లోతుగా గమనిస్తే…

Ongole constituency: అభివృద్ధిలో వెనుకడుగు..!

బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయిన తరువాత కరోనా వల్లనో.., లేక రాజకీయాలు ఎక్కువ అవ్వడం వల్లనో.., వివాదాల కారణంగానో అభివృద్ధి మీద ఫోకస్ చేయలేకపోయారు. ప్రభుత్వం నుండి నిధుల లేమి వల్ల కూడా కావచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడా మాత్రమే జరిగాయి. నాయకత్వం వరకు బాగుంది, పేరు ఉంది కానీ అభివృద్ధి పనులు చూసుకుంటే దామచర్ల జనార్ధన్ పనితీరు బాగుందనే ఒంగోలులో చర్చ ఉంది. ఇక్కడ టీడీపీకి రెండు అనుకూల అంశాలు ఉన్నాయి. ఒకటి గతంలో చేసిన అభివృద్ధి, మరొకటి జనసేన – టీడీపీ కలిసి పని చేస్తే ఈజీగా అవకాశాలు ఉంటాయని అంటున్నారు. వైసీపీకి సంబంధించి సంస్థాగతంగా బలంగా ఉంది. క్షేత్ర స్థాయిలో యాక్టివ్ గా పని చేసే ద్వితీయ శ్రేణి నాయకుల బలం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి జిల్లాలో ఓ పెద్ద ఆస్తి. అయితే వైసీపీకి పెద్ద మైనస్ ఏమిటంటే అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంకు తోడు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఒంగోలులో ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతానికి మాత్రం 60 శాతం వరకూ వైసీపీ చాలా బలంగా ఉంది. తిరుగులేని శక్తిగానే ఉంది. అయితే టీడీపీ – జనసేన కూటమిగా పోటీ చేస్తే మాత్రం వీరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అంచనా.

జనసేనతో టీడీపీ పొత్తు ఉంటే గెలుపు ఖాయమే..!

ఒక స్ట్రాటజీ ప్రకారం టీడీపీ బలంగా ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక వేళ టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ఈజీగా గెలుచుకునే అయిదు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఒంగోలు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా కావచ్చు.., కాపు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు.., కమ్మ సామాజిక వర్గ ఓట్లు అలానే బీసీల్లో కొందరు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అందుకే 2014 ఎన్నికల్లో వర్క్ అవుట్ అయ్యింది. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బలమైన నాయకుడు. ఆయనపై గతంలో ఒక్క అవినీతి ఆరోపణలు కూడా లేవు. చాలా క్లీన్ గా పని చేశారు. అందరినీ తన ఇంట్లో మనుషుల్లాగానే చూసుకునే వారు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అటువంటి నాయకుడు 2014లో ఓడిపోయారంటే అప్పట్లో ఈ కూటమి ప్రభావమే. ఇక్కడ జనసేన, టీడీపీ కూటమి అంత బలంగా పని చేసింది. 2019 లో వారి మధ్య పొత్తు లేకపోవడం.., వైసీపీ బలమైన గాలి.., జనార్దన్ సొంత తప్పిదాలు.. నమ్ముకున్న నేతలు దూరమవడంతో జనార్ధన్ 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో బాలినేనిపై ఓడిపోయారు. అయితే ఇప్పుడు మంత్రి బాలినేని పనితీరు పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. 2014 నుండి 2019 వరకూ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్ధన్ అభివృద్ధి పనులకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఒంగోలు నగరంలో కొంత మేరకు రూపురేఖలు మార్చడంలో, సీసీ రోడ్ల నిర్మాణం చేయడం, డ్రైయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మున్సిపల్ పరిధిలో పనులు చేయించడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒంగోలులో ప్రధానమైన తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా ప్రయత్నించారు. అందుకే జనార్ధనపై ఇప్పుడిప్పుడే మళ్ళీ గురి కుదురుతుంది.. ఆయన కూడా చురుకయ్యే పనిలో ఉన్నారు. 2019 ఓటమి నుండి తేరుకుని.. ఒంగోలులో తాను మళ్ళీ పునః రాజకీయం మొదలెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. అటు బాలినేని మాత్రం బయటకు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికి.. లోలోపల మాత్రం ఈ రెండేళ్లలో తాను కొన్ని వర్గాలను, కొందరు నేతలను దూరం చేసుకున్నానన్న భయం వెంటాడుతుంది..! అందుకే రాబోయే రెండేళ్లలో సరిదిద్దుకునే పనిలో పడినట్టే కనిపిస్తుంది..

Exit mobile version