MLA RK Roja: వైసీపీ ఫెయిర్ బ్రాండ్ మహిళా ఎమ్మెల్యే రోజా తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. సినీ రంగం నుండి టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటి రోజా ఆ తరువాత వైసీపీలో చేరి సీఎం వైఎస్ జగన్ వద్ద మంచి పరపతి సాధించారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డిప్యూటి సీఎం నారాయణస్వామితోనూ ఆమెకు విభేదాలు ఉండటంతో పార్టీలో, నియోజకవర్గంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలోనూ, బయట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తదితరులపై పంచ్ డైలాగ్ లతో తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ తన మార్కును ప్రదర్శిస్తుంటారు రోజా.
రోజాకు తొలి విడతలోనే మంత్రి పదవి వరిస్తుందని ఆమెతో పాటు పార్టీలోనూ చాలా మంది అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించలేకపోయారు. దీంతో ఆమె అలిగారు. అయితే ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చినా అయిష్టంగా ఒప్పుకుని స్వీకరించారు. మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్న నేపథ్యంలో ఈ సారి ఛాన్స్ తగలవచ్చేమో అన్న అభిప్రాయంలో ఉన్నారు ఆమె. అప్పటికి మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నామినేటెడ్ పదవుల పందేరంలో ఆమె పదవిని వేరే వారికి ఇచ్చేశారు.
ఇకపోతే చిత్తూరు జిల్లా నుండి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లా నుండి రోజాతో పాటు సీఎం జగన్ కు సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మంత్రి పదవులపై ఆశతో ఉన్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో విబేధాలు ఉండటంతో ఆమెకు మంత్రి పదవి అందని ద్రాక్షే అవుతుందా లేక మంత్రి పదవి వరిస్తుందా అన్నది వేచి చూడాలి.