Granite Prakasam: వందలాది టిప్పర్లు.. వేలాది కార్మికులు.. నిత్యం పేలుళ్లు.. రాళ్ల చప్పుళ్ళు.. రోడ్లపై చక్కర్లు.. చాటు మాటున వందల కోట్ల అవినీతి..! ఈ అవినీతిని తవ్వే క్రమంలో వైసీపీ ప్రభుత్వం పెద్ద యజ్ఞమే చేసింది. పెద్ద ప్రసహనమే చేసింది. ఒక పెద్ద ప్రయత్నమే చేసింది. ఒక పెద్ద ప్రక్షాళన చేసింది. కానీ అవినీతిని అంతం చేయలేదు. మధ్యలోనే చేతులెత్తేసింది. కొందర్ని లొంగదీసుకుంది. కొందర్ని భయపెట్టి మూలన పెట్టింది. కానీ చిన్న వాళ్ళ కడుపులు కొట్టింది. గ్రానైట్ పరిశ్రమలో ఏడాదిగా జరిగిన మార్పుల కారణంగా పెద్దల క్వారీలు లాభ పడ్డాయి, చిన్న చితక క్వారీలు మూలపడ్డాయి. అన్నిటికీ మించి క్వారీలను నమ్ముకున్న పరిశ్రమలు పూర్తిగా చితికిపోయాయి..!
Granite Prakasam: ఎన్ని మార్పులో… మీకు తెలుసా..!?
జిల్లాలో 2019 నాటికి దాదాపు 45 క్వారీలు నడుస్తుంటే.. వాటిని అనుబంధంగా రాళ్లను నమ్ముకుని దాదాపు 400 గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలు నడిచేవి. గడిచిన ఏడాదిన్నరగా జరిగిన ప్రక్షాళన, మార్పులు, కఠిన నిబంధనలు, తనిఖీలు కారణంగా దాదాపు సగం క్వారీలు నిలిచిపోయాయి. కొన్ని పెద్ద పెద్ద క్వారీలు నడుస్తున్నప్పటికీ వాటి రాళ్లు మొత్తం ఎగుమతికి తప్ప, జిల్లాలో పరిశ్రమలకు పనికిరావు. ఈ ఫలితంగా జిల్లాలో ఈ ఏడాదిన్నర వ్యవధిలో సుమారుగా 200 గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి..!
- జిల్లాలో పెద్ద పెద్ద క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. చీమకుర్తిలో శిద్దా కుటుంబానికి చెందిన 11 లీజులు, ఆనంద్, బూచేపల్లి, పెర్ల్ రాజా కుటుంబానికి చెందిన క్వారీలు మాత్రమే ప్రస్తుతం నడుస్తుండగా.., బల్లికురవలో జిల్లాలో ప్రముఖ నాయకుడు ఇటీవల కొనుగోలు చేసిన క్వారీలు నడుస్తున్నాయి. ఇవన్నీ పెద్ద తరహా వ్యాపారాలు. భారీ స్థాయిలో రాళ్ళూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. చిన్న కొలతలు, వృథా తక్కువ ఉంటుంది. ఇవి ఉంటేనే జిల్లాలో పరిశ్రమలకు ముడిసరుకు.. కానీ అటువంటి చిన్న రాళ్ళూ, కొలతలు లేనివి, వృథా మెటీరియల్ లేని కారణంగా చాలా పరిశ్రమల్లో లావాదేవీలు నిలిచిపోయాయి.
- జిల్లాలో గ్రానైట్ క్వారీల్లో 45 లీజులు ఉంటే.., వాటి అన్నిట్లో అవినీతి రుజువయింది. రూ. 2100 కోట్ల వరకు ఫైన్ పడింది..! * అవినీతి కేసులు, భారీ ఫైన్లు, ఒత్తిళ్లు కారణంగా కొందరు లీజులు వదులుకుని వెళ్లిపోయారు, కొందరు పార్టీకి లొంగిపోయారు. కొందరు క్వారీలు అమ్ముకున్నారు. లొంగిన వాళ్ళు కొద్దో గొప్పో బాగానే ఉన్నారు. వదిలేసిన వాళ్ళు, అమ్మేసిన వాళ్ల క్వారీలు ఆగిపోయాయి.
- ఓ వైపు క్వారీలు ఆగిపోవడం, మరోవైపు పరిశ్రమలు మూత పడిన కారణంగా దాదాపు లక్ష మంది కార్మికులు రోడ్డుల పడ్డారు. జిల్లాలో కేవలం గ్రానైట్ పరిశ్రమను నమ్ముకుని లక్ష మందికి పైగా జీవిస్తున్నారు. రోజు కూలీలుగా, చిన్న చిన్న వేతన దారులుగా జీవిస్తుండగా.. వారి జీవనంపై ఇప్పుడు పెద్ద పిడుగు పడింది.
అవినీతి ఆగలేదు.. కానీ ఉపాధి పోయింది..!
గ్రానైట్ వ్యవహారంలో ప్రభుత్వం ఉద్దేశం నెరవేరలేదు. అవినీతిని అంతం చేయాలనుకున్న ఉద్దేశం ఆగలేదు. జరుగుతున్నా తతంగం లోలోపల జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద లీజు దారులు లావాదేవీలు నడిపిస్తూనే ఉన్నారు. కానీ చిన్న వాళ్లపై పెద్ద పిడుగు పడిన కారణంగా వాళ్ళే నష్టపోయారు. పెద్ద క్వారీలు ఉన్న శిద్దా కుటుంబం వైసీపీలో చేరిపోయింది. గొట్టిపాటి రవి కొన్ని క్వారీలు అమ్మేశారు. కొన్ని మూసేసారు. చీమకుర్తిలో కొందరు లీజులను రద్దు చేసుకుని, అధికార పార్టీ నేతలకు అప్పగించేశారు.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం సాధించినది ఏమి లేదు. ఉపాధి తీసేసిన పాపం తప్ప..!