Darsi YSRCP: జిల్లాలో అధికార పార్టీకి తిరుగులేదు.. కార్యకర్తల బలం, నాయకుల బలం, ప్రజా బలం విషయంలో వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది.. కానీ ఆ పార్టీని వేధిస్తున్న సమస్యలన్నీ సమన్వయలేములే.. నియోజకవర్గాల్లో గ్రూపులు.., జిల్లాలో పెద్ద దిక్కుగా నడిపించే నేత లేకపోవడం.., అవినీతి పెరగడమే సమస్య.. జిల్లాలో ఆ పార్టీకి ద్వంద్వ నాయకత్వంతో అతి పెద్ద సమస్యగా మారిన రెండు నియోజకవర్గాల్లో మొదటిది చీరాల, రెండోది దర్శి.. చీరాల తెగని పంచాయతీ. 2024 ఎన్నికల వరకూ చీరాల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.. ఎవరూ వినే రకమూ కాదు..! దర్శి విషయంలో మాత్రం సీఎం జగన్ స్పష్తమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మూడు రోజుల కిందట దర్శి నియోజకవర్గ పంచాయతీ సీఎం దగ్గరకు వెళ్లిన సందర్భంలో కొన్ని కీలక ఆదేశాలిచ్చారు. వీటన్నిటినీ విన్నట్టే విని.., తల ఊపి బయటకు వచ్చాక ఆ.. ఏముందిలే..!? అని లైట్ తీసుకున్నారని సమాచారం..!
Darsi YSRCP: బూచేపల్లికి ఎమ్మెల్సీ..!
సీఎం జగన్ తో భేటీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దిశెట్టి వ్యవహరిస్తున్న తీరు, ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, ఆరోపణలు, తన వర్గాన్ని టార్గెట్ చేయడం.. ఇలా అన్ని అంశాలను జగన్ దగ్గర ప్రస్తావించారు. వీటన్నిటినీ విన్న తర్వాత జగన్ బూచేపల్లికి కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. “2023 లో ఎమ్మెల్సీ స్థానాలు చాలా ఖాళీ అవుతాయి. నీకు ఎమ్మెల్సీ ఇస్తాను. 2024 ఎన్నికల్లో మద్దిశెట్టికి దర్శి సీటు ఇస్తాను. అతనికి సపోర్ట్ చెయ్” అని కోరినట్టు తెలిసింది. తన వర్గాన్ని టార్గెట్ చేయకుండా.., సమన్వయంతో వెళ్తే తనకేమి అభ్యంతరం లేదని బూచేపల్లి చెప్పినట్టు” విశ్వసనీయ వర్గాల సమాచారం.. కానీ బయటకు వచ్చిన తర్వాత బూచేపల్లి ఈ ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. “2024 నాటికి పార్టీలో ఉండేదెవరో.., పోయేదెవరో తేలుతుంది. అప్పటికి ఎన్ని మార్పులు జరుగుతాయో..?” అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
మద్దిశెట్టికి అక్షింతలు.. ఆశీర్వాదాలు..!!
ఇదే సమయంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వైఖరిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దర్శిలో భిన్నమైన సామాజికవర్గాలున్నాయని.., అటువంటి చోట సమన్వయంతో కలుపుకుని వెళ్లాలని.. వచ్చే ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలిచేలా పని చేయాలని” సున్నితంగా చెప్పినట్టు తెలిసింది. అంతకు ముందు బాలినేని వద్ద ఈ ఇద్దరి పంచాయతీ జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేపైనా, అతని వర్గీయులపైనా వస్తున్న ఆరోపణలుపై మంత్రి బాలినేని సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీకి చెడ్డపేరు లేకుండా చూసుకోవాలని, పార్టీ కోసం పని చేసిన వారికీ అన్యాయం చేయకుండా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.
- దర్శి నియోజకవర్గ పంచాయతీపై ఇటు మంత్రి బాలినేని, సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కీలక సూచనలు చేశారు. కానీ ఇక్కడ ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. తమ అంతరంగీకుల దగ్గర ఎవరికీ వారు, ప్రత్యర్థులపై కారాలు, మిరియాలు నూరినట్టు వారి వర్గీయులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం” అంటూ పరోక్ష సవాళ్లు చేసుకుంటున్నారట.. నిజానికి ఇటువంటి సున్నితమైన క్షేత్రస్థాయి విబేధాలను తేల్చడం ఒక సిటింగ్ లో జరగని పని.. సీఎం జగన్ మరో రెండు, మూడు సిటింగ్ లు వేయించి.. ఎవరి అభ్యంతరాలు.. ఎవరి తప్పులు ఏమిటనేది స్పష్టంగా తెలుసుకుని.. ఒక కచ్చితమైన సంకేతాలిస్తేనే ఈ పంచాయతీ వీడే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.